డిఎస్‌సికి గడువు పెంచాలి

May 8,2025 20:22

వయో పరిమితి 47ఏళ్లకు పెంచాలి

కోట జంక్షన్‌ వద్ద డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన, రాస్తారోకో

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  డిఎస్‌సి పరీక్ష గడువు పెంచాలని, అభ్యర్థుల వయో పరిమితిని 47ఏళ్లకు పెంచాలని, జిల్లాకు ఒకే పేపరు విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కోట జంక్షన్‌ వద్ద అభ్యర్థులు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. కార్యక్రమన్ని ఉద్దేశించి డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ సిహెచ్‌ హరీష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏళ్లతరబడి చేసిన పోరాట ఫలితంగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ సాధించుకున్నామని తెలిపారు. ఏడేళ్ల తర్వాత వెలుడిన నోటిఫికేషన్‌లో నిరుద్యోగులు సన్నద్ధం కావడానికి పరీక్షకు కనీసం 90రోజులను సమయం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వయోపరిమితి 44 సంవత్సరాలుగా పేర్కొనడంతో చాలా మందికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 47సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడానికి వయోపరిమితి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 47ఏళ్ల వరకు అవకాశం కల్పించాలని కోరారు. నార్మలైజేషన్‌ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఓపెన్‌ డిగ్రీలో పాసైన వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్‌ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాము, భాను, ఈశ్వర్‌ రావు, అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️