- పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం
ప్రజాశక్తి-అనంతపురం, గోరంట్ల,కలెక్టరేట్ : ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్ముకాశ్మీర్ వద్ద భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సైనికుడు వీరమరణం పొందారు. గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన జవాను మురళీనాయక్ (22) మరణించారు. మృతి విషయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు, జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్మీ ఉన్నతాధికారులు శుక్రవారం తెలియజేశారు. మురళీనాయక్ అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామంలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మురళీనాయక్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న రోజుల్లో 29-12-2022న ఆర్మీలో చేరారు. నాసిక్లో శిక్షణ, అస్సాంలో ఏడాది పాటు ఉద్యోగం, తర్వాత పంజాబ్లో విధులు నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం ప్రారంభం కావడంతో రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్ సరిహద్దుకు వెళ్లారు. అక్కడ జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు. జవాను మృతికి నివాళిగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ సర్కిల్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మురళీనాయక్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులు అర్పించారు.
గవర్నర్, చంద్రబాబు, జగన్ సహా పలువురి విచారం
‘దేశాన్ని రక్షించడంలో తన ప్రాణాలను త్యాగం చేసిన ధైర్య సైనికుడికి నివాళులు అర్పిస్తున్నాను’ అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జవాన్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. మురళీనాయక్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సాయంగా ఉంటామని భరోసా నిచ్చారు. ‘దేశం కోసం జవాన్ చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబానికి నా హఅదయపూర్వక సానుభూతి. ఈ ద్ణుఖ సమయంలో మేము వారితో పాటు నిలుస్తాం’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. జవాన్ తల్లిదండ్రులను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ కలిసి ఓదార్చారు. తక్షణం సాయంగా రూ.ఐదు లక్షల సాయాన్ని అందజేశారు. మురళీ నాయక్ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.