ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామంలోని తన పొలంలో విద్యుత్ హై టెన్షన్ వైర్లు క్రిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన రైతు వురదాసు చిన్న రాజు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఏవో మాధవరావు కు పి జి ఆర్ ఎస్ లో విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు గ్రామంలో 3 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమి మీదుగా వెళ్లే విద్యుత్తు వైర్లు క్రిందికి వేలాడుతున్నాయన్నారు. వ్యవసాయ పనుల సమయంలో ఈ వైర్లు దుక్కు దున్నే ట్రాక్టర్ కు, పొలంలో పని చేసే వారికి తగిలే ప్రమాదం ఉందని, ఈ వైర్లు సరి చేయించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. త్వరలోనే వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ విద్యుత్ వైర్లు సరి చేయించే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పొలంలో వేలాడుతున్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు.. గ్రీవెన్స్ లో రైతు ఫిర్యాదు
