ఫొటో : హరనాధ్పురం సెంటర్లో ఎరుపెక్కిన ప్రాంతం
మార్క్సిస్టుల ‘మహా’ పండుగ..!
– నేటి నుంచి సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు
– నగరం అరుణకాంతులు
– నెల్లూరు చేరుకున్న ప్రతినిధులు
– ఐదు ప్రచార జాతాలకు స్వాగతం
– నేడు ప్రారంభ సభ
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి : కమ్యూనిస్టుల ప్రజా పోరాటాల కేంద్రం నెల్లూరు నగరం సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలకు సంసిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులు ఘనంగా నిర్వహించనున్నారు.. మాగంట లేవుట్లోని సీతారాం ఏచూరి (అనిల్ గార్డెన్)లో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ఎం బేబి ప్రారంభించనున్నారు. నెల్లూరు నగరం అరుణోరణమైంది. ప్రతి నోటా సిపిఎం మహాసభల ఊసులే. రాష్ట్ర నలమూలల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు నగరం చేరుకున్నారు. ప్రతినిధులు, ముఖ్య అతిధులు నగరానికి చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని ఐదు ఉద్యమ కేంద్రాల నుంచి ప్రారంభమైన జాతాలు శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నాయి. ప్రతినిధుల సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుకుంది. నగరంలోని సిపిఎం ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.. దక్షిణ భాతర కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ రథసారథి, పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు) 27వ రాష్ట్ర మహాసభలకు నెల్లూరు నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. నెల్లూరు నగరంతోపాటు, జిల్లా వ్యాపితంగా మహాసభల సందడి కనిపిస్తోంది. ”ఇంటికో మనిషి… ఊరుకో బండి..నెల్లూరు తరలిరండి” అనే నినాదంతో ప్రదర్శన, బహిరంగ సభల విజయవంతానికి సిద్ధమయ్యారు. మూడు రోజలు ప్రతినిధుల సభ నిర్వహించే మాగుంట లేవుట్లోని అనిల్గార్డెన్ వద్ద ఏర్పాట్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పి. మధు. వెంటేశ్వర్లు పరిశీలించారు. ప్రతినిధులకు . భోజనం, వసతి, రవాణా, వైద్యం అన్ని విషయాలను దగ్గరుండి చూస్తున్నారు. ప్రతినిధుల సభ వేదికను ప్రత్యేకంగా తయారు చేశారు. భారీ ఎల్ఇడి స్క్రీన్లు ఆకర్షణగా ఉంది. పుచ్చపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య నిలువెత్తు ప్లెక్సీలతోపాటు, సీతారాం ఏచూరి చిత్రం స్క్రీన్పై ఉండేలా చేశారు. మరోవైపు విఎంఎస్ నంబూద్రిపాద్, బుద్దదేవ్ బట్టాచార్య, పొటోలు పెట్టారు. ప్రతినిదుల సభ వద్ద కేరళ తరహా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వాగత ద్వారాలు అటు , ఇటు జాతీయ, రాష్ట్ర నాయకులు చిత్ర పటాలు ఉంచారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. నగరంలోని వారికి 12 చోట్ల వసతి ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్స్టేషన్లో వలంటీర్లను ఏర్పాటు చేసి స్వాగతించనున్నారు. మహాసభల్లో ప్రతినిధులకు సేవలందించడానికి సుమారు రెండు వందల మంది వలంటీర్లను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ఐదు కేంద్రాల నుంచి ప్రారంభమైన జాతాలు శుక్రవారం రాత్రి అనిల్గార్డెన్ వద్దకు చేరుకున్నాయి. ఆహ్వాన సంఘం స్వాగతం పలికింది. ముఖ్య అతిధులు, కేంద్ర నాయకులు, ప్రతినిధులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చేలా ఇప్పటికే నగరంలోని ప్రధాన హోటళ్లు, అపార్ట్మెంట్లు, మీటింగ్ హాల్ సిద్ధం చేశారు. నగరం అరుణశోభితం..!నెల్లూరు నగరం అరుణశోభితమైంది… అటు నుంచి ఇటు…ఇటు నుంచి అటు ఎటూ చూసినా ఎర్రకాంతులు చిమ్ముతున్నాయి.. 47 సంవత్సరాల తరువాత నెల్లూరు నగరంలో జరుగుతోన్న సభలు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడ్డారు. . నగరంలో ప్రధాన కేంద్రాలు, కూడళ్లు సిపిఎం ప్లెక్సీ, తోరణాలు, హోర్డింగ్లతో దర్శనమిస్తున్నాయి. నెల్లూరు రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ, సుందరయ్య బొమ్మ, అంబేద్కర్ బొమ్మ, మద్రాసు బస్టాండ్, ఆర్టిసి, మాగుంట విగ్రహం, వేదాయపాళెం. అన్నమయ్య సర్కిల్, బెజవాడ గోపాల్రెడ్డి, వెంటేశ్వరపురం, జనార్దన్రెడ్డికాలనీ, పడుగుపాడు కేంద్రాలతోపాటు నగరంలోని ప్రదాన కూడళ్లు ఎరుపెక్కాయి.. స్థానిక హరనాధ్పురం సెంటర్లో సిపిఎం నాయకులు, కాయం శ్రీనివాసులు నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వాగత ఏర్పాట్లు కూడలిలో అరుణకాంతులు చిందుతున్నాయి. జిల్లా వ్యాపితంగా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు, బుచ్చిరెడ్డిపాళెం,తోపాటు అన్ని కేంద్రాల్లో మహాసభల హడావుడి నెలకొంది. బాలాజీ నగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఈ ప్రాంతంలో గోడరాతలు ప్రత్యేకం ఆకర్షణగా నిలిచాయి.కార్మికులు, కర్షకులు, తమ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహాసభల తోరణాలు, జెండాలతో నింపుతున్నారు. కృష్ణపట్నం పోర్టు రోడ్డులోని చేపల మార్కెట్ కార్మికులు తమ ప్రాంతానికి పార్టీ పతాకాలతో నింపారు. స్థానిక హరనాద్పురం సెంటర్లో ఏర్పాటు చేసిన తోరణాలు నగరవాసులను అబ్బురపరుస్తున్నాయి. ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేసి ఎర్రతోరణాలతో గొడుగులా తయారుచేశారు. శుక్రవారం రాత్రికి నగరం మంతా ప్రచారం పూర్తి చేసుకుంది. ఎర్రతోరణాలు, బ్యానర్లు, ప్లెక్సీలు, ఆర్చీలతో నిండిపోయింది. మహిళలు, యువత, పిల్లలు, అందరూ మహసభల ఏర్పాట్లులో నిమగమయ్యారు. ప్రతినిదుల సభా వేదికను అందంగా ముస్తాబు చేశారు. సిపిఎం రాష్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వర్లు, వి.వెంకటేశ్వర్లు దగ్గరుండి పరిశీలించారు. ప్రతినిధులకు మంచి అనుభూతిని పంచేలా ఆహ్వాన సంఘం ఏర్పాట్లు చేసింది. నేడు సభలు ప్రారంభం…! నెల్లూరు నగరంలో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను శనివారం ఉదయం 9 గంటలకు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్ (సీతారాం ఏచూరి) నగర్లో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు 24 గంటలు కష్టపడి స్థూపం తయారుచేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభ సభకు నగరంలోని ప్రముఖులు, ఇతర రాజకీయపార్టీల నాయకులను ఆహ్వానించారు. కేరళ నుంచి వచ్చిన పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు ఎంఎ బేబికి చెన్నరు విమానాశ్రయంలో ఆహ్వాన సంఘం స్వాగతం పలికింది. అర్అండ్బి అతిథి గృహానికి చేరుకున్నారు.. సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు నగరం చేరుకున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కమిటీ నుంచి పరిశీలకులుగా అరుణ్కుమార్, డాక్టర్ హేమలత హాజరుకానున్నారు.
