ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరిలో గంజాయి ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో గురువారం డిఎస్పి పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కనిగిరి పట్టణంలోని మంగలి మన్యంకు చెందిన నాగులూరి నరసింహ, నాగులూరి రాజేశ్వరి, దొరువు బజారుకు చెందిన కట్టాదుర్గ, పాతూరుకు చెందిన నాగులూరి దుర్గాప్రసాద్ అనే నలుగురు నాగులూరి వెంకటేశ్వర్లు, అతని కుమారుడు నాగులూరి అంకబాబు వద్ద ఒకటిన్నర కేజీ గంజాయి కొనుగోలు చేసి కనిగిరిలోని దొరువు సమీపంలో పొట్లాలుగా కట్టి విక్రయిస్తుండగా కనిగిరి సీఐ షేక్ ఖాజావలి, కనిగిరి హెచ్ఎంపాడు ఎస్ఐలు టి.శ్రీరామ్, మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కొనుగోలు చేసిన నలుగురిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి సుమారు పాతికవేల విలువైన ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను కూడా అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టీం: డీఎస్పీగంజాయి ప్రతిరోజూ వినియోగిస్తున్న 20 మందిని గుర్తించి వారిపై కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఇటీవల కనిగిరిలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్లో గంజాయి విక్రయాల సమాచారం తెలుసుకుని నిఘా పెట్టి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఆ టీం సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి కొనుగోలు చేసే విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలను అభినందించారు. ప్రత్యేకంగా కషి చేసిన కానిస్టేబుల్స్ నారాయణ, నూనె నాగేశ్వరరావు, హోంగార్డు మోతుకూరి సీతారాం ప్రసాద్లను అభినందిస్తూ క్యాష్ రివార్డును ప్రోత్సాహకంగా అందజేశారు.
