ప్రజాశక్తి-నెల్లిమర్ల/కొత్తవలస : ప్రతీ నియోజకవర్గంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఒక ఎంఎస్ఎంఇ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఫ్లాటెడ్ కాంప్లెక్స్ వద్ద పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుందని, దీనివల్ల తక్కువ పెట్టుబడితోనే చిన్నచిన్న పరిశ్రమలను స్థాపించుకొనే అవకాశం కలుగుతుందని చెప్పారు. కేవలం ముద్ర రుణాలు రూ.20 లక్షలతోనే పరిశ్రమను పెట్టుకోవచ్చునని సూచించారు. సుమారు 900 చదరపు అడుగుల స్థలాన్ని నామమాత్రపు ధరకే లీజుకు ఇస్తామన్నారు. మూడు ఎకరాల స్థలంలో రూ.15.55కోట్లతో జిప్లస్2 విధానంలో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్ ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా, మరో 50మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన నెల్లిమర్ల ఎంఎల్ఎ లోకం నాగమాధవి మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, త్వరలో యువతకు పారిశ్రామిక వర్క్షాప్ను నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్, కూరగాయాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులు, పళ్లు చేపలు, మాసం ఉత్పత్తుల పార్క్లను ఏర్పాటు చేసి ఎగుమతి చేసుకొనే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను యువత వినియోగించుకోవాలని కోరారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించేందుకు అనువుగా వారికి శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, నెల్లిమర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ బంగారు సరోజిని, వైస్ ఛైర్మన్ ఎస్.రామారావు, డెంకాడ ఎంపిపి బి.వాసుదేవరావు, ఆర్డి కీర్తి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ మురళీమోహన్, పరిశ్రమల కేంద్రం ఎడి రామకష్ణ, తాహశీల్దార్ సుదర్శనరావు, మున్సిపల్ కమిషనర్ తారకనాధ్, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికుల కాల్పులు కారణంగా మృతి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు.
బలిఘట్టంలో ఎంఎస్ఎంఇ పార్కుకు శంకుస్థాపన
కొత్తవలస : ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.జిల్లాకు మొదటివిడతలో మంజూరైన నాలుగు పార్కుల్లో, మొట్టమొదటి పార్కుకు బలిఘట్టంలో శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో, దాదాపు రూ.7కోట్ల వ్యయంతో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేవారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. జిల్లాకు మొదటి దశలోనే ఎస్.కోట, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యువత, మహిళా సంఘాలు పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రావాలని కోరారు. బలిఘట్టంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఇ పార్కులో సుమారు రూ.96 కోట్ల పెట్టుబడితో 76 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని, 1500 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. ఎస్.కోట ఎంఎల్ఏ కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, సర్పంచ్ ఎం.ఎర్రయ్య రామస్వామి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ మురళీమోహన్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్, సహాయ సంచాలకులు బి.రామకష్ణ, ఆర్డిఓ కీర్తి, తాహసీల్దార్ నీలకంఠేశ్వర్రావు పాల్గొన్నారు.