బొబ్బిలి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం

  • అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 21, వ్యతిరేకంగా 10 ఓట్లు

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల ప్రీసీడింగ్‌ అధికారి రామ్మోహనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎన్నికల అధికారి ప్రవేశ పెట్టి అనుకూలంగా ఓట్లు వేసిన వారు చేతులు ఎత్తాలని కోరగా 10మంది టీడీపీ కౌన్సిలర్లు, 10మంది వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు బేబినాయన చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణకు అనుకూలంగా ఉన్నవారు చేతులు ఎత్తాలని కోరగా 10 మంది వైసీపీ కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 21 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓట్లు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల ప్రీసీడింగ్‌ అధికారి రామ్మోహనరావు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ అయిన వెంటనే వైసీపీకు మద్దతు ఇచ్చిన 10 మంది వైసీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు.

వైసీపీ కౌన్సిలర్‌, ఎన్నికల ప్రీసీడింగ్‌ అధికారి మధ్య వాగ్వివాదం
మున్సిపల్‌ ప్రత్యేక సమావేశంలో వైసీపీ కౌన్సిలర్‌ చోడిగంజి రమేష్‌ నాయుడు, ఎన్నికల ప్రీసీడింగ్‌ అధికారి రామ్మోహనరావు మధ్య వాగ్వాదం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో కౌన్సిల్‌’లో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు బలాన్ని చెప్పాలని రమేష్‌ నాయుడు కోరగా ఎన్నికల అధికారి అభ్యంతరం చెప్పారు. పార్టీల బలం మేము చెప్పమని, నిబంధనలు మేరకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సహకరించాలని ఎన్నికల అధికారి కోరారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణపై జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద డిఎస్పీ భవ్యరెడ్డి, పట్టణ సిఐ కె.సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

➡️