ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : చెన్నై శాంసంగ్లో పని చేస్తున్న కార్మికులు 4 వారాలుగా సమ్మె చేస్తున్నా పట్టిచ్చుకోని శాంసంగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లె వెంకటరమణ, నాయకులు శాంతికుమారి మాట్లాడుతూ 2వేల మంది ఉన్న కార్మికులు కంపెనీలో 1450 మంది సిఐటియులో సభ్యత్వం వుండి సమ్మె చేస్తుంటే, పట్టించుకోకపోవడం యాజమాన్య దుర్మార్గానికి పరాకాష్టని అన్నారు. సౌత్ కొరియా కంపెనీ యాజమాన్యం, మన దేశంలో మన రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాల్సిన యాజమాన్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న శాంసంగ్ యాజమాన్యపై చర్యలు తీసుకొని సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, లక్ష్మి, తులసి, పావని, డ్రైవరమ్మ, మంగమ్మ, పార్వతి, సుశీల తదితరులు పాల్గొన్నారు.
