ప్రజాశక్తి -గాజువాక : విశాఖ డెయిరీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని విశాఖ డెయిరీ కాంటాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు పిల్లా భాస్కరరావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమస్యలపై విశాఖ డెయిరీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారమూ కొనసాగాయి. గురువారం చేస్తున్న దీక్షలకు విశాఖ డెయిరీ కాంటాక్ట్ లేబర్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ, విశాఖ డెయిరీలో పర్మినెంట్ కార్మికులతో పాటు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని కోరారు. 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం ఉన్న కార్మికులను కూడా పర్మినెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దాడి నాగ మారనీ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమణ, కార్మికులు పాల్గొన్నారు.