ప్రజాశక్తి-విజయనగరంకోట : ముఖ్య వ్యక్తుల భద్రతలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పి వకుల్ జిందాల్ అన్నారు. సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలోని ఫైరింగు రేంజ్లో వివిధ ఆయుధాలను వినియోగిస్తూ ముఖ్య వ్యక్తుల భద్రత విధులు నిర్వహించే పిఎస్ఒల ఫైరింగు ప్రాక్టీసును మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పిఎస్ఒలకు మూడు రోజులపాటు నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో ముఖ్యవ్యక్తుల భద్రతకు వారు నిర్వహించే విధులు, చేపట్టాల్సిన చర్యలు, శారీరక దారుఢ్యం మెరుగు పర్చుకొనడంలో శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం ఎస్పి ఫైరింగు ప్రాక్టీసులో పాల్గొని, వివిధ ఆయుధాలతో ఫైరింగు ప్రాక్టీసు చేసారు. కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పి జి.నాగేశ్వరరావు, ఎస్బి సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
