ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రతిభ

ప్రజాశక్తి-బేస్తవారిపేట : పదో తరగతి (2024-25) పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరిచారు. బేస్తవారిపేట మండలంలో మొత్తం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎనిమిది ఉన్నాయి. అందులో ఏడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కాగా ఒకటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ విద్యా కేంద్రం ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 395 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బేస్తవారిపేట మండలం 79.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బేస్తవారిపేట ఎంఈఓ చెగిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని గలిజేరుగుల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి జి తిరుమల నారాయణ 571 మార్కులు సాధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా నిలిచారు. ఇదే పాఠశాలలో జి ఆకాష్‌ 558 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో రెండు స్థానం కైవసం చేసుకున్నారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే వరదరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న అద్దంకి సిద్దయ్య అనే విద్యార్థి 570 మార్కులు సాధించి ఆ ప్రభుత్వ పాఠశాల పరిధిలో రెండో స్థానం సాధించారు. మండల స్థాయిలో బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి రెండో స్థానం సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సిద్దేశ్వర శర్మ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిభ కనబరిచిన సిద్దయ్యకు స్వీట్లు తినిపించి అభినందించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పి విజిత 562 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల పరిధిలో మూడో స్థానం సాధించారు. మండల స్థాయిలో మూడో స్థానం సాధించిన పి విజితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే తిరుపతిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విజితను అభినందిం చారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బిజ్జం మంజులత అనే బాలిక 560 మార్కులు సాధించి మండల స్థాయిలో నాలుగో స్థానం పొందారు. మంజులతను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొల్లా పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. పూసలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీ కీర్తన 554 మార్కు లతో మండల స్థాయిలో అయిదో స్థానం సాధించారు. కీర్తనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌డి షబ్బీర్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. బేస్తవారిపేట పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల లో పదో తరగతి చదువుతున్న స్వాతి 550 మార్కులు సాధించి మండల స్థాయిలో ఆరో స్థానం సాధించారు. ఇదే పాఠశాలలోని మరో విద్యార్థి పి లావణ్య 527 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో రెండో స్థానం సాధించారు. వీరిద్దరినీ పాఠశాల ప్రిన్సిపల్‌ సిహెచ్‌ సత్యవతి, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మండల స్థాయిలో ప్రతిభ విద్యార్థులను బేస్తవారిపేట ఎంఈఓలు చేగిరెడ్డి వెంకటరమణారెడ్డి, కొర్ర కాశయ్యలు విద్యార్థులను, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు.

➡️