డిఎస్సి అభ్యర్థుల్లో ఆందోళన
గడువు పెంచాలని డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 583 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి జులై 6వరకు డిఎస్సి పరీక్ష జరుగనుంది. ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆన్లైన్ పద్దతిలో నెల రోజులు పాటు ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నోటిఫికేషన్కు పరీక్ష సమయానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండడంతో గడువు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్కు, పరీక్ష తేదీకి మధ్య 45 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తొలి సంతకం చేశారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పది నెలల తరువాత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు సంతోషిస్తున్నా 45రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. డిఎస్సి ద్వారా ఉమ్మడి జిల్లాలోని 583 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 446, గురుకులాల్లో 137 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదేళ్లుగా డిఎస్సి నిర్వహించకపోవడంతో బిఎడ్, డిఎడ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సిపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 60 నుంచి 80 వేల మంది వరకు అర్హులైన అభ్యర్థులు ఉన్నారు. డిఎస్సి అనగానే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్య పుస్తకాలనూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ సిలబస్తో కూడుకున్నదని, ఎంత బాగా చదివిన వారైనా ఒక్కసారైనా పూర్తిస్థాయిలో రివిజన్ చేయాలంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడుతుందని అంటున్నారు. ప్రభుత్వం పది నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు నోటిఫికేషన్ ఇచ్చినా చదువుకునేందుకు సమయం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 2018 డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించి నార్మలైజేషన్ చేయడం వల్ల బాగా చదివిన వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రమంతా ఒకే పరీక్ష పత్రం కాకుండా తెలంగాణా రాష్ట్రం మాదిరిగా ప్రతి జిల్లాకు ఒక పరీక్షా పత్రం జారీ చేయాలని, దీనివల్ల లీకేజీలు తదితర సమస్యలను అధిగమించవచ్చని అంటున్నారు. కావున తగిన సమయం ఇచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అభ్యర్థులకు సమయమివ్వాలి
డిఎస్సి సిల బస్ పూర్తిస్థాయిలో రివిజన్ చేయాలంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడు తుంది. నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణ లోకి తీసుకోవాలి. అభ్యర్థులు నష్టపోకుండా ఆఫ్ లైన్ పరీక్ష లేదా ఆన్లైన్ అయితే జిల్లా అభ్యర్ధులంతా ఒకే పేపర్ రాసేలా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో అభ్యర్ధులతో కలిసి ఆందోళనకు దిగాల్సి వస్తుంది.
సిహెచ్ హరీష్ డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్