ప్రజాశక్తి – కడప అర్బన్ : ప్రపంచ కార్మిక వర్గపు ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ అని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 207వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని మార్క్స్ రూపొందించారని తెలిపారు. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కార్ల్ మార్క్స్ ఉధృతం చేశారని పేర్కొన్నారు. సమాజంలో అందరికీ తిండి, ఇల్లు, బట్ట లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారన్నారు. సమాజంలో రోజురోజుకు పేదల సంఖ్య పెరుగుతోందని, అదే స్థాయిలో కార్పొరేట్ల సంపద కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ధనిక, పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్క్సిజం కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రామిక వర్గం కులం, మతం ప్రాతిపదికన కాకుండా శ్రమ ఆధారంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మార్క్స్ జీవితంలో అనేక త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని, ఆ త్యాగాల స్ఫూర్తితో సమ సమాజ స్థాపన కోసం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మార్క్స్, ఎంగిల్స్ కార్మిక వర్గం కోసం తమ యావదాస్తిని త్యాగం చేయడంతో పాటు కుటుంబంలో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకు సాగారని అన్నారు. అలాంటి త్యాగ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, అన్వేష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, నగర కమిటీ సభ్యులు కుమారస్వామిరెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ఫణి రాజు, రసూల్, జార్జి, ప్రవీణ్ కుమార్, ఉదయ్ పాల్గొన్నారు.
