- 11 న అభ్యుదయ పుస్తకాలతో తిరుపతిలో భారీ ప్రదర్శన
తిరుపతి సిటీ : శనివారం రాత్రి తిరుపతిలో విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనశాలపై దౌర్జన్యం చేసి పెరియార్ పుస్తకాలను విక్రయించకూడదంటూ … చెలరేగిపోయిన భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేయాలని పలువురు రచయితలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో తిరుపతి గంధమనేని శివయ్య కఅష్ణారెడ్డి భవన్ లో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అభ్యుదయ భావాలను రచనలను కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సమావేశం పిలుపునిచ్చింది. 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ నుండి అభ్యుదయ పుస్తకాలతో భారీ ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించింది. ఈ సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, రాష్ట్ర నాయకులు సాకం నాగరాజు, శరత్ చంద్ర, పౌర చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి వాకా ప్రసాద్, పరమేశ్వర రావు, డిహెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కరవది సుబ్బారావు, అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి రమణ, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి, సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మధురాంతకం నరేంద్ర, సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు మురళి నాగరాజు, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జనార్దన్, బిసి సంఘర్షణ సమితి నాయకులు బుసకాని లక్ష్మయ్య, కేశవులు, ఐద్వా కార్యదర్శి లక్ష్మి తదితరులు ప్రసంగించారు. నగరంలోని వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.