ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : ఒకవైపు ఆక్రమణలన్నీ తొలగిస్తున్నామంటూ బందరు మొత్తం జెసిబిలుతో హడావిడి చేస్తారు. మరోపక్క వాళ్లే సగం పైగా రోడ్డు ఆక్రమించేస్తారు. ఫోటోలో సైకిల్ స్టాండ్ ను తలపిస్తున్న దృశ్యం మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా కోనేరు సెంటర్ నుంచి నవకళా సెంటర్ వరకు వెళ్లే మార్గం ఇలా మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల బండ్లచే ఆక్రమించబడింది. సిబ్బంది ఇంతకుముందు కార్యాలయంలో ఖాళీగా ఉన్న వేప చెట్టు క్రింద తమ టూ వీలర్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్రదేశం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తోంది. బయట రోడ్డు మీద వాహనాల రద్దీ చూసే వాళ్లకి కార్యాలయంలో ఏమైనా సమావేశాలు జరుగుతున్నాయా, ప్రజా సమస్యల పరిష్కారార్థం ఇంతమంది ప్రజలు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చారా సందేహాలు కలుగుతున్నాయి . ఆరా తీస్తే అలాంటిదేమీ లేదని గేటు వద్దనున్న వాచ్మెన్ చెప్తున్నాడు. కేవలం ఆఫీసులో పని చేసే ఉద్యోగులు కూడా తమ వాహనాలను రోడ్డుపైనే పెట్టాలని గేట్లకు తాళాలు వేసి కేవలం మనుషులు మాత్రమే లోపలికి వెళ్లే విధంగా సిబ్బందిని కాపలా పెట్టడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలిసింది. స్వయానా మున్సిపల్ కమిషనర్ చోడే వీర వెంకట సత్య బాపిరాజు వాహనం కూడా రోడ్డుపైనే నిలిపి ఉండడం విశేషం. మచిలీపట్నం నగరపాలక సంస్థ సమీపంలో ఏదైనా ప్రైవేట్ స్థలం చూసుకుని ఎవరైనా ఉపాధి, ఉద్యోగం లేని వ్యక్తులు సైకిల్ స్టాండ్ పెట్టుకుంటే మంచి లాభ సాటిగా ఉంటుందని విద్యావంతులు చమత్కరిస్తున్నారు.
