ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఢిల్లీలో ఈనెల 20 నుండి 23 వరకు జరుగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ముగ్గురు పారా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. శనివారం జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నెల చెన్నైలో జరిగిన 23వ జాతీయ స్థాయి పారాలింపిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కిల్లక లలిత, దొగ్గా దేముడు నాయుడు, సుంకరి దినేష్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారని, వీరిలో కిల్లక లలిత ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఆడేందుకు వెళ్లగా మిగిలిన ఇద్దరు త్వరలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు.
