టిడ్కో లబ్ధిదారులు రుణగ్రస్తులయ్యారు

Mar 10,2025 00:20

టిడ్కో ఇళ్ల నివాసితులతో మాట్లాడుతున్న బాబూరావు ఇతర నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వాలు రుణగ్రస్తులను చేశాయని, గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు విమర్శించారు. సిపిఎం ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరులోని టిడ్కో గృహ సముదాయాలను బాబూరావు, నగర కార్యదర్శి కె.నళినికాంత్‌, నగర నాయకులు సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ లబ్ధిదా రులు బ్యాంకులలో నుండి రూ.2.50 లక్షలు రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ.10.50 లక్షలు చెల్లించాల్సి వస్తుం దన్నారు. అసలు కంటే వడ్డీనే మూడు రెట్లు అధికంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేద న్నారు. ఇప్పటికీ గృహాలు కేటాయించని వారికి తక్షణమే కేటాయించాలని కోరారు. ఇప్పటికే రూ.50 వేలు, రూ.లక్ష డిపాజిట్‌ చెల్లించి, ఇల్లు దక్కక అద్దె ఇళ్లలో ఉంటూ, వడ్డీ కోసం బ్యాంకర్ల నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీతో సహా భరించాలని, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం….
సిపిఎం బృందానికి లబ్ధిదారులు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ఆరు కుటుంబాలకు సరిపడే సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంక్‌ను 16 కుటుంబాలకు సరఫరా చేస్తున్నారని, రోజు మార్చి రోజు, అది కూడా గంట సేపు మాత్రమే నీళ్లు వస్తున్నా యని, మురుగు నీరు వస్తోందని, తాగటానికి ఉపయోగ పడట్లేదని వాపోయారు. తాగటానికి వంటకు డబ్బా నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. దాదాపు 4 వేలకుపైగా గృహాలున్న ఇక్కడ సచివాలయం లేదని, రేషన్‌, పెన్షన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రావట్లేదని చెప్పారు. ప్రతినెలా ముసలి వాళ్లతో సహా గతంలో తాము నివసించిన ప్రాంతాలకు వెళ్లి పెన్షన్‌, రేషన్‌ తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. టిడ్కో గృహాలకు తమను మ్యాపింగ్‌ చేయాలని కోరినా పట్టించుకోవట్లేదన్నారు. నగరానికి దూరంగా ఉండటం వల్ల పనులు కూడా ఉండట్లేదని, పనుల కోసం నగరంలోకి వెళ్లటానికి రోజుకు రూ.50-100 ఖర్చవుతోందని తెలిపారు. ఇళ్ల కోసం తాము చెల్లించిన డిపాజిట్‌లో సగం తిరిగి ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముళ్ల చెట్లను శుభ్రం చేయించాలని కోరారు. కొందరు డిపాజిట్‌ చెల్లించినా ఇల్లు కేటాయించలేదని, రిజిస్ట్రేషన్‌ చేయలేదని, కానీ వడ్డీ కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమసమస్యలు పరిష్కలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఎ.నికల్సన్‌, లూథర్‌ పాల్‌, మస్తాన్‌వలి, కాసింషహీద్‌, శ్రీనివాస్‌, బి.లక్ష్మణరావు, అబ్దుల్‌ సలీం, నాయుడు పద్మ, సి.పద్మనాభుడు, రంగ పాల్గొన్నారు.

➡️