సమయం తక్కువ..! : డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన

May 6,2025 15:10 #DSC 2024

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డిఎస్సీ ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 583 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే పరీక్షలకు 45 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న సమయంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తొలి సంతకం చేశారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పది నెలల తరువాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు సంతోషిస్తున్నా పరీక్షకు సమయం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 583 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో 446, గురుకులాల్లో 137 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదేళ్లుగా డీఎస్సీనిర్వహించకపోవడంతో బిఎడ్, డిఎడ్ చేసిన నిరుద్యోగ అభ్యర్ధులు ఈ ప్రభుత్వం విడుదల చేయనున్న డీఎస్సీపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 60 నుంచి 80 వేలు వరకూ అర్హులైన అభ్యర్థులు ఉన్నారు.
డిఎస్సి అనగానే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ సిలబస్ తో కూడుకున్నదని, ఎంత బాగా చదివిన వారైనా ఒక్కసారైనా పూర్తిస్థాయిలో రివిజన్ చేయాలి అంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడుతుంది. ప్రభుత్వం పది నెలల నుండి నానబెట్టి కనీసం ప్రిఫర్ అయ్యే సమయాన్ని ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడం ఎంతవరకు సమంజసమని పలు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 2018 డిఎస్సీ పరీక్షలో బాగా చదివిన వారికి కాకుండా డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించి నార్మలైజేషన్ చేయడమే వలన చాలా బాగా చదివిన వారికి ఉద్యోగులు రాకుండా పోయాయని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. సమయం ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సమయం ఇవ్వాలి
అనేక పోరాటాల ఫలితంగా నోటిఫికేషన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం.. నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. డిఎస్సీ సిలబస్ పూర్తిస్థాయిలో రివిజన్ చేయాలంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడుతుంది. గత నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో దానిపైన పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తున్న డిఎస్సీ కోచింగ్ పూర్తి కావడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను కనీసం 60 రోజుల నుండి 90 రోజులకు పెంచాలి. అభ్యర్ధులు ఎవరూ నష్టపోకుండా ఆఫ్ లైన్ పరీక్ష లేదా ఆన్లైన్ అయితే జిల్లా అభ్యర్ధులంతా ఒకే పేపర్ రాసేలా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో అభ్యర్ధులతో కలిసి ఆందోళనకు దిగాల్సి వస్తుందని డి వై ఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ బి. హరీష్ హెచ్చరించారు.

 

➡️