ఆర్టీసీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి: సిఐటియు ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : డిపోలోని ఆర్టీసీ కాంటాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ తులసి రాం, పుత్తూరు డిపో గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ సర్క్యులర్ ప్రకారం జీతాలు అమలు చేయాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదలయ్యే కాంట్రాక్ట్ కార్మికుల డిఎ పెంపు నోటిఫికేషన్ను, నోటీసును బోర్డు ద్వారా కార్మికులకు తెలపాలని, పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపును కార్మికులకు తెలపాలని కార్మికులకు జీతంతో కూడిన తొమ్మిది రోజుల సెలవును అమలు చేయాలని, డిపో పరిధిలోని, బస్టాండ్ పరిధిలోని, పనిచేస్తున్న సఫాయి కర్మచారులలో, మరుగుదొడ్లు మురికి కాలువలలో శుభ్రం చేయించు కుంటున్న ప్రకారం వేతనాలు చెల్లించాలని, అద్దె బస్సు టెండర్లతో పేర్కొంటున్న విధంగా సిబ్బందికి ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ డిడిఎల్ కృషి చేయాలని, ఈఎస్ఐ ను కార్మికులు ఉపయోగించే విధంగా అమలు చేయాలని, ప్రతినెలా ఐదో తేదీ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సత్యవేడు: ఆర్టిసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నాయకులు ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్కు ఆర్టీసీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ తులసి రాం, తిరుపతి జిల్లా నాయకుడు భాస్కర్, సత్యవేడు సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎం రమేష్ వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఆర్టిసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
