మహిళకు వందనంవేడుకగా మహిళా దినోత్సవంప్రజాశక్తి – తిరుపతి టౌన్, యంత్రాంగం జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం సంబరంగా జరిగాయి. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. విశేష ప్రతిభ కనబరచిన మహిళలను గుర్తించి సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ, ఉప్పరపల్లెకు వెళ్లే రహదారి మలుపులో కార్పొరేషన్ నిధులతో వివిధ రంగాల్లో రాణిస్తున్న ఎనిమిది మహిళా విగ్రహాలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినరురెడ్డి, ముద్రనారాయణలు మహిళా వర్సిటీ వైస్ఛాన్సలర్ భారతి చేతుల మీదుగా ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ఎనిమిది మహిళా మణుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. 80 లక్షల వ్యయంతో మహిలా విగ్రహాలను, ప్రీ లెఫ్ట్ పనులను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్తేజ్రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ తిరుమాలిక మోహన్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిఇ మహేష్ పాల్గొన్నారు. లైన్స్క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి ఆర్గనైజేషన్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ మాడ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. డాక్టర్ అనుపమ, చెంచయ్య, ఓంప్రకాష్, చక్రపాణి, శంకర్, చౌదరి, జయలక్ష్మి పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహిళా వర్సిటీ వీసి దేవూరు భారతి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, మహిళా అధ్యయన కేంద్రం, సెంటర్ ఫర్ విమెన్ సేఫ్టీ, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సావేరి సెమినార్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆచార్య దేపూరు భారతి ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ గురించి మాట్లాడుతూ మహిళలపై పెట్టుబడి పెట్టడం అనేది ప్రపంచ భవిష్యత్తుపై పెట్టుబడి వంటిదని, మహిళల అభివద్ధితోనే దేశ సుస్థిరాభివద్ధి సాధ్యపడుతుందని అన్నారు. నేటి సాంకేతిక యుగంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతూ కాదేది మహిళకు అసాధ్యం అని నిరూపించుకుంటూ ఉండడం హర్షనీయమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించి వంద సంవత్సరాలు దాటినప్పటికీ నేటికీ మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటూ వుండడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి కీలకోపన్యాసకులుగా విచ్చేసిన అమర హాస్పిటల్, తిరుపతి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమాదేవి మాట్లాడుతూ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ స్థిరత్వంలో ఆర్థిక పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అవకాశాల వినియోగంలో స్త్రీ, పురుషులకు సమానత్వం ఉండాలని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇండియా కోఆర్డినేటర్ సూర్య చంద్రారెడ్డి, సోషల్ వర్కర్ లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. రేణిగుంటలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సత్కరించారు. అనంతరం పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఆషా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు, వైసిపి నాయకులు ప్రభాకర్, టిడిపి నాయకులు భాస్కర్, పూమణి, లక్ష్మి, తేజోవతి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో.. సుందరయ్యభవన్లో జెవివి, ఐద్వా ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ఎం షరీఫ్ నాయకత్వంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారత, సామాజిక చైతన్యం దిశగా ఐద్వా అహర్నిశలు పోరాడుతోందన్నారు. కుప్పమ్మ, రేవతి, పుష్ప పాల్గొన్నారు. రామచంద్రాపురం (చంద్రగిరి)లో.. రైల్వేస్టేషన్లో అందరూ మహిళలే పనిచేస్తున్న ప్రత్యేకతను సంతరించుకుని ఒబిసి ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులను సత్కరించారు. దేశంలోనే రెండో మహిళా రైల్వేస్టేషన్ చంద్రగిరిలో ఉండటం గర్వకారణమని అన్నారు. తమ గురువర్యులు గల్లా అరుణకుమారి అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. మన సంస్కృతి సేవా ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ కె.హరినాథరెడ్డి పారిశుధ్య కార్మికులకు చీరలు పంచిపెట్టారు. చంద్రగిరి మేజర్ పంచాయతీ సర్పంచి రూపా రామ్మూర్తిని ఘనంగా సన్మానించారు. సూళ్లూరుపేటలో.. యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సభకు మహిళా కమిటీ జిల్లా కన్వీనర్ కెఎంఎస్ సునీల అధ్యక్షత వహించారు. యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక, సిఐటియు సంయుక్త ఆద్వర్యంలో జరిగిన సభకు తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండల నాయకులు హాజరయ్యారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. మాజీ ఎంఎల్సి విఠపు బాలసుబ్రమణ్యం విశిష్ట అతిథిగా విచ్చేసి సందేశం ఇచ్చారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి సి.చంద్రశేఖర్, తిరుపతి జిల్లా ఐద్వా నాయకురాలు డాక్టర్ సాయిలక్ష్మి, యుటిఎఫ్ నాయకులు దేవరాల నిర్మల, కె.శేఖర్, జిజె రాజశేఖర్, కె.ముత్యాలరెడ్డి, ఎస్ఎస్ నాయుడు, కందల శ్రీదేవి, ఎస్.చెంగయ్య, కె.లక్ష్మయ్య, వి.భాగ్యలక్ష్మి, లక్ష్మి, ఆర్.లక్ష్మి పాల్గొన్నారు.
