భవిష్యత్తు ఔషధరంగ నిపుణులదే : ఆచార్య డి సాంబరెడ్డిప్రజాశక్తి – క్యాంపస్ : ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు ఔషధ రంగ నిపుణులుదే అని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ ఆచార్యులు డి.సాంబరెడ్డి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కాలేజీ ఆధ్వర్యంలో ”కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఫార్మసీ ప్రొఫెషన్ అబ్రాడ్” అను అంశంపైన అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఔషధ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండును తీర్చేందుకు తమ అర్హతలు, నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో వివరించారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడంలో ఔషధ నిపుణుల పాత్ర, రిటైల్ ఫార్మసీ దాటి వివిధ కెరీర్ మార్గాలను గురించి చర్చించారు. విద్యార్థినులు ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్, ఫార్మసీ నిపుణుల కోసం వివిధ దేశాలలో ఉన్న జాబ్ ప్లేస్మెంట్లు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జ్యోత్స్న రాణి, ఆచార్య శ్రీదేవి, బోధనా సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
