ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం అంజూరుపాలెం కుల దురహంకార ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన ఆదే మండలంలో వెలుగు చూసింది. తమపై అధికారులకు ఫిర్యాదు చేశాడనే అక్కస్సుతో మఠం పంచాయతీ మాజీ దళిత సర్పంచ్పై పెత్తందారులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో వెంకటయ్యతో పాటు ఆయన భార్య పెంచలమ్మకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కెవిబిపురం మండలం మఠం గ్రామానికి చెందిన వెంకటయ్యకు ఎంఎ రాజులకండ్రిగ రెవెన్యూలోని సర్వే నెంబర్ 428/2లో 1.39 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఆ పొలానికి పక్కనే ఉన్న గల్లా సుదర్శన్ కుటుంబంతో వెంకటయ్యకు భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన దాడి ఘటనలో గల్లా సుదర్శన్ కుటుంబంపై అట్రాసిటీ కేసు నమోదైంది. అయినప్పటికీ సుదర్శన్ కుటుంబం.. వెంకటయ్య కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ వారిని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుండడంతో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఈ నెల 4న సిపిఎం నాయకులతో కలిసి కెవిబిపురం తహశీల్దారుకు సుదర్శన్ కుటుంబంపై వెంకటయ్య ఫిర్యాదు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న సుదర్శన్.. పొలం వద్దకు వచ్చిన వెంకటయ్య దంపతులను కులం పేరుతో దూషించి దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్య దంపతులను కెవిపిఎస్ నాయకులు పరామర్శించారు. బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకయ్యను పరామర్శించిన వారిలో నాయకులు అంగేరి పుల్లయ్య, గంధం మణి, పెనగడం గురవయ్య, గెడి వేణు, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ గురవయ్య తదితరులు ఉన్నారు.
