టిడిఆర్ బాండ్ల అవినీతిపై కమిటీప్రజాశక్తి -తిరుపతి టౌన్రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.454 కోట్ల నిధులను విడుదల చేశారని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. టిడిఆర్ బాండ్ల అవినీతిపై కమిటీ వేసి, అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. సోమవారం శ్రీవారి దర్శనం అనంతరం తుడా సమావేశ మందిరంలో తుడా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, చంద్రగిరి ఎంఎల్ఎలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, టిడిపి మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, తుడ వీసి వెంకటరమణ హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్థంగా ఉందన్నారు. తుడా ఆదాయం సంవత్సరానికి 15 కోట్లు ఉంటే ఖర్చులు కూడా 15 కోట్లు చూపి ఏం అభివద్ధి చేశారని అధికారులను ప్రశ్నించారు.త్వరలోనే టిడిఆర్ బాండ్ల సమస్య పరిష్కారం రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు తీసుకుని రోడ్లు వేశారని, భూములు కోల్పోయిన వారికి టిడిఆర్ బాండ్లును వైసిపికి అనుకూలంగా ఉండేవారికి ఇచ్చారు తప్ప, అర్హులకు ఇవ్వలేదన్నారు. దీనిపై ఓ కమిటీని వేసి వచ్చే నెలలో అర్హులకు టిడిఆర్ బాండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగిల్ డెస్క్ పద్ధతిలో భవనాల అనుమతులు ఇస్తామన్నారు. శెట్టిపల్లి సమస్య పరిష్కరిస్తా తిరుపతి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి సమస్య పరిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మంత్రి నారాయణను కోరడంతో ఈ భూ సమస్యను పరిష్కరించడానికి తన వంతు చర్యలు తీసుకుంటానని మంత్రి నారాయణ తెలిపారు. శెట్టిపల్లిని ఐటి హబ్ గా మార్చడానికి కషి చేస్తామని చెప్పారు. దీంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొత్త కనెక్షన్ తిరుపతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో చేపట్టేలా పరిశీలిస్తామన్నారు. స్మార్ట్ సిటీ పథకంలో రాష్ట్రం వాటా రాకపోవడంతో ఆగిపోయిన పనులు మరింత వేగంగా పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతోపాటు ఆటోనగర్ విస్తరించడమా లేదంటే మరో ఆటోనగర్ నిర్మించడమా అనేదానిపై తాను మరోసారి తిరుపతికి వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. తుడా లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వేలం వేశారు? ఎంత ఆదాయం వచ్చింది? కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి? వాటిని గురించి మంత్రి నారాయణ తుడా విసిని అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు సమగ్రంగా తీసుకొని విజయవాడకు రావాలని వీసి తో పాటు తుడా అకౌంటెంట్ కూడా సమావేశానికి రావాలని కోరారు.చెవిరెడ్డి అవినీతిపై విచారణ జరిపించండి వైసిపి పాలనలో తుడా ఛైర్మన్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అవినీతిపై విచారణ జరపాలని ఎంఎల్ఎ పులివర్తి నాని మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. 2019 నుంచి 2024 వరకూ విమాన ఛార్జీల బిల్లులు పరిశీలించాలని కోరారు. తుడా నిధులతో కొనుగోలు చేసిన కుర్చీలు, బెంచీలపై చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. రాయలచెరువు రోడ్డులో నిర్మిస్తున్న టవర్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు. తుడా పరిధిలో అనర్హులు తిష్టవేసి జీతాలు తీసుకుంటున్నారన్నారు. తుడా పరిధిలో లేఔట్ వేసి వెంచర్ వేసి వాటిని వ్యాపారం చేశారని, రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. సూరప్పకశం పద్మనగర్ లేఔట్పై విచారణ జరపాలని కోరారు. తిరుచానూరు పెద్ద చెరువును పూడ్చడం వల్ల అనేక కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉందని, దాన్ని బాగు చేయాల్సిన బాధ్యతను మంత్రి తీసుకోవాలని కోరారు.
