కూటమికి ‘బలం’ లేకేనా..!స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదాఎన్నికలు నిర్వహించాలని వైసిపి ధర్నాకోర్టును ఆశ్రయిస్తామన్న మేయర్ శిరీషప్రజాశక్తి -తిరుపతి టౌన్తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఊహించిన విధంగానే వాయిదా పడ్డాయి. నామినేషన్ ప్రక్రియ బుధవారం నిర్వహించాల్సిన ఉంది. నామినేషన్ వేసేందుకు వైసిపి కార్పొరేటర్లతో పాటు మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోని విసి హాల్లో మేయర్తో పాటు కార్పొరేటర్లు తగిన సంఖ్యాబలంతో వచ్చారు. ఎన్నికలు నిర్వహించడానికి కమిషనర్ సమాధానం చెప్పాల్సి ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి రాధిక వచ్చి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష దగ్గరకు వచ్చి నోటీసు ఇచ్చారు. దీనికి మేయర్ డాక్టర్ శిరీషతో పాటు పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్నికల వాయిదా వేస్తున్నట్టు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్యదర్శి ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారో సమాధానం రాతపూర్వకంగా లేకపోవడంతో వైసిపి కార్పొరేటర్లు ఎన్నికలు జరిపించాలని నినాదాలు చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కార్పొరేషన్ కార్యాలయంలో గొడవ జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టిడిపి జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనేందుకు రాలేదు. ఎన్నికలు జరిపించాలని వైసీపీ కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లలో 31 మంది కార్పొరేటర్లు వైసీపీ తరఫున ఉన్నారని, టిడిపి జనసేన పార్టీ నుంచి 16 మంది కార్పొరేటర్లే ఉన్నారని, బలం లేకనే కూటమి పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ ఎన్నికలు జరగకుండా ఉండేందుకు వాయిదా వేయించారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి ఎన్నికలు జరపాలని కోరుతామని పేర్కొన్నారు. అక్టోబర్ నాలుగో తేదీ జరగాల్సిన ఈ ఎన్నికలు తిరుమల బ్రహ్మౌత్సవాలు ప్రారంభం అవుతుండడం, ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారనే కారణంతోనే ఎన్నికలు వాయిదా వేసినట్లు మేయర్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను అడ్డుకోవడానికి టిడిపి జనసేన పార్టీ నేతలు వైసిపి కార్పొరేటర్లపై అక్రమ కేసులు బనాయించి వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే వరకు వైసిపి కార్పొరేటర్లు పోరాటం చేస్తారని మేయర్ డాక్టర్ శిరీష హెచ్చరించారు. ఎన్నికల వాయిదా వేయడానికి కారణాలు కమిషనర్ సక్రమంగా చెప్పకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎస్కే బాబు, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఉమాదేవి ,ఆరని సంధ్యారెడ్డి, కో ఆప్షన్ మెంబర్ వెంకట్ రెడ్డి, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామారావు అమర్నాథ్ రెడ్డి వైసీపీ నేతలు పాల్గొన్నారు.