పోలీసుల అదుపులో ‘మయూర’ హోటల్ అధినేత జయరాం చౌదరి

Apr 26,2025 10:34 #fraud case, #Tirupati district

ఎన్ఐ యాక్ట్ కేసులో అరెస్టుకు కోల్ కతా హైకోర్టు ఆదేశం

తిరుపతి సిటీ : తిరుపతికి చెందిన మయూర షుగర్స్ అధినేత జయరామ చౌదరిని ఈస్ట్ పోలీసులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కోల్ కతాకు చెందిన టెరాయ్ ఓవర్సీస్ సంస్థకు చక్కెర సరఫరా చేస్తామని 2014లో జయరామచౌదరి ఒప్పందం కుదుర్చుకుని రూ.8 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో చక్కెర సరఫరా చేయలేదు. అడ్వాన్సుగా తీసుకున్న రూ.8 కోట్లలో రూ.3 కోట్లు వెనక్కు చెల్లించారు. ఇంకా రూ.5 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉండటంతో 2023లో టెరాయ్ ఓవర్సీస్ సంస్థ కోల్ కతా హైకోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద కేసు వేసింది. ఆ క్రమంలో హైకోర్టు ఆయనపై అరెస్టు వారంట్ జారీ చేసింది. తిరుపతి జిల్లా పరిధిలో నివాసం ఉన్నందున ఆయన్ను అదుపులోకి తీసుకుని కోల్ కతా పోలీసులకు అప్పగించాలని ఎస్పీని ఆదేశించింది. ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో ఈస్ట్ పోలీసులు అధికారులు, సిబ్బంది కలసి చెన్నై నగర శివార్లలోని ఓ లాడ్జీలో వున్న జయరామ చౌదరిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం తిరుపతికి బయలుదేరారు. ఎస్పీ ద్వారా కోల్ కతా పోలీసులకు అప్పగిస్తారని సమాచారం.

➡️