ప్రజాశక్తి – వెంకటగిరి రూరల్ సైదాపురం తెల్లరాయి మైన్స్కు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉంది. మండలంలో దాదాపు వంద తెల్లరాయి మైన్స్ ఉన్నాయి. గూడూరు, పొదలకూరు మండలాల పరిధిలో మరో 70 మైన్స్ ఉన్నాయి. వీటిలో 130 మైన్స్కు అన్ని అనుమతులు ఉన్నట్లు సమాచారం. 40 మైన్స్కు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైకా, పల్స్పర్, క్వార్ట్జ్, వర్క్వైట్ తీస్తారు. లీజు రెన్యువల్ చేయాల్సి ఉండగా ఒప్పందాలు సరిగ్గా లేకపోవడంతో 130 మైన్స్లో పనులు నిలిచిపోయాయని తెలుస్తోంది. తొమ్మిది నెలలుగా మంత్రి కొల్లు రవీంద్ర, నారా లోకేష్లతో పలుమార్లు మైన్స్ లీజుదారులు కలిసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికి నాలుగుసార్లు లీజుదారులతో సమావేశమైనా సమస్య కొలిక్కి రాలేదు. ఓ ప్రజాప్రతినిధి కోసం, పదివేల మంది కార్మికుల పొట్టగొట్టారన్నది స్థానికుల ఆవేదన. రోజుకు కోట్లల్లో వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో మైనింగ్లో ‘చక్రం’ తిప్పుతూ, కార్మికుల పొట్ట గొడుతున్నారన్న ఆవేదన ‘స్థానికుల్లో’ ఉంది. మనుబోలు వద్ద త్వరలో ప్రారంభించన్న మైనింగ్ ఫ్యాక్టరీకే లీజుదారులంతా ‘తెల్లరాయి’ తాను చెప్పిన రేటుకు తరలించేందుకే పెద్దఎత్తున రాజకీయం నడుస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మైనింగ్ అధికారులు ఓ రకంగా ‘కీలు బొమ్మలే’. 10వేల మంది కార్మికుల ఇక్కట్లు సైదాపురం మండలంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఎక్కువమంది మైన్స్లో పనిచేస్తూ జీవనం సాగిస్తారు. గూడూరు మండలంలోని వెడిచర్ల, తుంగపాలెం, చెమిర్తి, కందలి, మంగళపూరు, చెన్నూరు, నెల్లటూరు, గొల్లపల్లి,కొమ్మనేటూరు గ్రామాల నుంచి కార్మికులు పనులు చేస్తున్నారు. రాపూరు మండలం నుంచి పులిగిలిపాడు, బోధనపల్లి, నవాబుపేట, చానాయపాలెం, డ్యాంరోడ్డు, దుగ్గగుంట, గిలకపాడు గ్రామాల నుంచి పనులు చేస్తారు. పొదలకూరు మండలం నుంచి డేగపూడి, ముదిగేడు, కొత్త కంబాలపల్లి గ్రామాల నుంచి పనిచేస్తారు. రాయి బయటకు తీసే కార్మికులు, లారీ, టిప్పర్, జేసీబీ, ట్రాక్టర్, కార్లు తదితర డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులందరికీ గత తొమ్మిది నెలలుగా పనులు లేక వీధినపడిన పరిస్థితి. కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరంతా దాదాపు పదివేల మందిపైనే ఉంటారని అంచనా. 2వేల మంది వలస కార్మికులు బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఉన్నారని సమాచారం. వీరు రోజంతా దాదాపు 10 గంటలు పనిచేస్తే గిట్టుబాటు అయ్యే కూలి కేవలం రూ.500 మాత్రమే. అయినా మండుటెండలోనూ సెగలు కక్కుతూ పనిచేసే వీరికి, ప్రస్తుతం పనులు లేక ఆకలి కేకలతో ఒక్కొక్కరు వలస బాట పడుతున్నారు. పనులు కోల్పోడానికి కారకులెవరు? ఈ మైనింగ్ మాఫియాలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు సంబంధించిన రెండు ఎక్స్పోర్ట్ కంపెనీలు మాత్రమే విదేశాలకు తెల్లరాయిని సరఫరా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్లో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. మరో కంపెనీ కూడా మనుబోలులో త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. తనకు మాత్రమే సరకు విక్రయించాలని మైన్స్ యజమానులను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైన్స్ యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. అన్ని మైన్స్ను తన గుప్పెట్లో పెట్టుకుని వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, తమ వ్యాపారాలు జరగనీకుండా ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటివరకూ లీజుదారులకు న్యాయం జరగలేదు. ఇప్పటికి నాలుగుసార్లు లీజుదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తమకే సరకు విక్రయించాలని డిమాండ్ చేశారని సమాచారం. దీంతో వారు ససేమిరా అనడంతో అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ రంగాన్ని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వారు చెట్టుకొకరు పుట్టుకొకరుగా మిగిలిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేతికి పెత్తనంఅధికార పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం కోసం మైనింగ్ పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళింది. కావాలని ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రజలు, కార్మికులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు మైనర్ మినరల్స్ జాబితా కింద రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అనుమతులు, ఇప్పుడు మేజర్ మినరల్స్ కింద కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. ఇకపై ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ పరిధిలో అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అమరావతి చుట్టూ తిరిగిన లీజుదారులు ఇప్పుడు ఢిల్లీకి తిరగాల్సి ఉంటుంది, అక్కడ ఎవరికి పలుకుబడి ఉంటే వారి చేతికి లీజ్ దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్న లీజు ఇకపై 50 సంవత్సరాలకు పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహించి, ప్రత్యేక జోన్గా నిర్ణయించాకా అప్పుడు కేంద్రం అనుమతులిచ్చే అవకాశాలున్నాయి. ఇది ఎప్పటికి పూర్తి అవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం మైనింగ్లో వెంకటగిరి రాజాలే ‘కింగ్’లు. అయితే రాజులు పోయారు, రాజరికం అంతరించిపోయింది. వెంకటగిరి ప్రాంతంలోరాజా కుటుంబం తన రాజ భవనాన్ని అద్దెలకు ఇచ్చింది. ఎప్పటినుంచో టిడిపిలో కొనసాగిన రాజాలు గత ఎన్నికల్లో వైసిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపి అధికారంలోకి రాగానే కలిచేడు మైన్ లీజు దక్కించుకోడానికి ఆ కుటుంబం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
