ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన పంటప్రజాశక్తి – యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ భాస్కరయ్య తెలిపారు. యర్రావారిపాలెం మండలం నెరబైలు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ‘ఆత్మ’ సహకారంతో రైతులకు శిక్షణ ఇచ్చారు. స్థానికంగా దొరికే సేంద్రీయ వనరులను వినియోగించి సాగు చేస్తే, రసాయన పురుగు మందుల ఎరువులపై రైతులు పెట్టే ఖర్చు తగ్గిపోతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో నేలలో జీవం పెరిగి ఆరోగ్యంగా ఉండి రసాయనిక అవశేషాలు లేని ఆహారం ప్రజలకు అందుతుందన్నారు. మామిడి, టమోటా పంటల్లో ఆచరించాల్సిన ప్రకృతిసాగు పద్ధతులను వివరించారు. మండల కేంద్రం ఎఒ వేణుగోపాల్రావు వేరుశనగ పంటల్లో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. మండల వ్యవసాయ అధికారి ఖాదర్బాష, వ్యవసాయ విస్తరణ సహాయకులు నళినిదేవి, మునిశేఖర్, రాజశేఖర్ పాల్గొన్నారు. చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలోనూ రైతులకు శిక్షణ ఇచ్చారు. అనావష్టితో బెట్ట పరిస్థితులు, అకాల వర్షాలు, పంటలలో కొత్త రకాల చీడలు వాతావరణ మార్పుల వలన రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తెలిపారు. రామచంద్రాపురంలో.. ఖరీఫ్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, పంటలు వేసుకోడానికి పదును అదునుగా ఉందని డిపిఎం షన్ముగం తెలిపారు. మంగళవారం మండలంలోని అనుపల్లి, సి.కాళేపల్లి, నెత్తకుప్పం, వేపకుప్పం, రాయలచెరువు , కుప్పంబాదూరు గ్రామాలలో ప్రకతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేసిన పలు పంట పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ రాష్ట్ర సీనియర్ కన్సల్టెంట్ సురేంద్ర రెడ్డి, అడిషనల్ డీపీఎం పట్టాభిరెడ్డి పాల్గొన్నారు.
