ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్ : గిద్దలూరు సిపిఎం కార్యాలయంలో బి పూర్ణ అధ్యక్షతన మంగళవారం గిద్దలూరు డివిజన్ సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు వి బాలకోటయ్య పాల్గొని మాట్లాడుతూ గిద్దలూరు ప్రాంతంలో రైతులు ఎక్కువగా తెల్ల, నల్ల బర్లి పొగాకు సాగు చేశారని అన్నారు. ప్రభుత్వం కనీసం మద్దతు ధర క్వింటా రూ.15 వేలు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు పండించిన పొగాకును అమ్మేందుకు వేలం కేంద్రం దగ్గరికి తీసుకుపోవడంతో అక్కడ కొనుగోలు చేయక రవాణా ఖర్చులు భారమయి రైతు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పొగాకు వేలం కేంద్రాలలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి పొలాల్లో, పాకల్లో ఉన్న పొగాకు వర్షానికి తడిసి పొగాకు రంగు మారిపాడై పోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిక చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు టి ఆవులయ్య, బి నర్సింహులు, డి తామస్ తదితరులు పాల్గొన్నారు.
