మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రంలో ఈ నెలలో జరగబోయే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి పారదర్శకంగా నిర్వహించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంను కొనసాగించాలని, సెక్షన్కు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:45గా చూపాలని అన్నారు. రేషనలైజేషన్లో జూనియర్, సీనియర్కి ఒకే నిబంధన ఉండేలా చూడాలని, మాన్యూవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ఏదైనా ఇద్దరు ఎస్జిటిలు కచ్చితంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పదేపదే రేషనలైజేషన్కు గురవుతున్న ఉపాధ్యాయులకు ఈ బదిలీల్లో తగు న్యాయం చేసే విధంగా పాయింట్స్ కేటాయించాలని కోరారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో అన్ని పోస్టులను అప్గ్రేడ్ చేసినందుకు పాఠశాల విద్యాశాఖకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం తరపున అభినందనలు తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర పప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ వేసవి సెలవులు ముగిసేలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి జూన్ 12 నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యుటిఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో సీనియార్టీ లిస్టులన్నీ అప్డేట్గా ఉండేటట్లు చూడాలని, పొరపాట్లు ఉంటే తక్షణం సరిచేయాలని, అన్ని ఖాళీలను డిస్ప్లే చేసి పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో బాధ్యులను సంప్రదించి తగు సహకారం పొందాలని సూచించారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు వై.నాగమణి, కార్యదర్శులు సిహెచ్.ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కేథార్నాథ్, ప్రేమ్కుమార్, చిన్నయ్య, గఫార్, శివరామిరెడ్డి పాల్గొన్నారు.
