గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన ర్యాలీ, సభ
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన గుమ్మలకీëపురంలో బుధవారం ఆదివాసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. ఎల్విన్పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు గిరిజనుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. అనంతరం వైటిసి వద్ద ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏజెన్సీలో నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జిఒ తీసుకువచ్చి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిఒ నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జిఒ తీసుకువచ్చి నూరు శాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు గిరిజనులకే కల్పించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ఆదివాసీ జెఎసి జిల్లా చైర్మన్ కొండగొర్రి ధర్మారావు, టైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బ లోవ రాజు, జిల్లా చైర్మన్ ఆర్.ఎస్.వరహాల దొర, జెఎసి నాయకులు ఇంటికుప్పల రామకృష్ణారావు, దుక్క సీతారాం, చంద్రశేఖర్, ఎంపిపి దీనమయ్య, గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ గౌరీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.