ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ మంగళవారం ముగిసింది. మూడోరోజు రాష్ట్ర అధ్యక్షులు జి.ఉదయరాజు అధ్యక్షతన జరిగిన సభలో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని, సిపిఎస్, జిపిఎస్, యుపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని తీర్మానం చేశారు. జీవో నెంబర్ 117, 84,85. జీవోలు రద్దు చేయాలని, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కొనసాగించాలని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ పాఠ్యపుస్తకాలలో సిలబస్ తగ్గించాలని, మున్సిపల్, ఉపాధ్యాయు లకు పిఎఫ్ సౌకర్యం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందిం చాలని, కెజిబివి ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని, మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులు 1998, 2008 ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని తీర్మానం చేశారు. డిఇఒ పూల్ లో ఉన్న తెలుగు ఉపాధ్యాయు లకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి పదోన్నతులు ఇవ్వాలని, పిఇటిలకు పీడీలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని, ఉద్యోగ ఉపాధ్యా యుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, స్కూల్ అసిస్టెంట్లకు జెఎల్ ప్రమోషన్స్ ఇవ్వాలని, విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాలోనికి మార్చాలని, ప్రపంచ శాంతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని నాయకులు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ. సదాశివరావు, కె.సుబ్బారెడ్డి, ఉపాధ్యాయ ప్రకతి సంపాదకులు జి.సత్య నారాయణ, ఉపాధ్యక్షులు వై.సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.ఈశ్వరరావు, అన్నిజిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు పాల్గొన్నారు.
