ఎస్‌ఆర్‌ఎం విద్యార్థి ఆత్మహత్య

  • భవనం పై నుంచి దూకిన వైనం
  • వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆవేదన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుభాష్‌ అనే విద్యార్థి ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో బిటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం ఉదయం వర్సిటీ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు తరలించారు. వర్సిటీ యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు విద్యార్థి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. మతదేహాన్ని చూసి కన్నీటిపర్వంతమయ్యారు.
లక్షల రూపాయలు చెల్లించింది

శవాన్ని తీసుకెళ్లడానికా..!

సుభాష్‌ తల్లిదండ్రులు ఎన్‌ఆర్‌ఐ వైద్యశాల వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో తమ కుమారుడిని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో చేర్పించామని తెలిపారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించింది శవాన్ని తీసుకెళ్లడానికా అని ఆవేదన వ్యక్తం చేశారు. 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన పెట్టారని, తమ కుమారుడికి 69 శాతం హాజరు ఉందని, కేవలం 6 శాతం హాజరు తగ్గిందన్న కారణంతో హాల్‌ టికెట్‌ నిరాకరించి పరీక్షలు రాసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ యాజమాన్యాన్ని కలిసి హాల్‌ టికెట్‌ ఇవ్వాలంటూ తాము కూడా అభ్యర్థించినా వినలేదని తెలిపారు. హాల్‌ టికెట్‌ ఇవ్వకపోవడం వలన పరీక్షలకు హాజరు కాలేదని, దీంతో మనస్తాపం చెంది తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు. ఉదయం 6:30 గంటలకు తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడితే తమకు 10 గంటలకు సమాచారం ఇచ్చారని, ఇంత జాప్యం జరిగిందంటే ఆ సమయంలో యాజమాన్యం ఏం చేస్తోందని నిలదీశారు. తమ కుమారుడి మృతికి ఎస్‌ఆర్‌ఎం యాజమాన్యం వేధింపులే కారణమని, దీనికి వారే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఫీజులు కట్టించుకోవడం వరకే యాజమాన్యం పరిమితం అవుతుందని, తమ యోగక్షేమాలపై శ్రద్ధ వహించడంలేదని విమర్శించారు. ఎస్‌ఆర్‌ఎం విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిగించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

➡️