వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : పేదలు, నిర్వాసితుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలోను, జిల్లాలోనూ చెరువులు, గెడ్డలు, పోరంబోకు భూములను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోని అధికారులు.. పేదలు, నిర్వాసితుల భూములను రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. మన్యం జిల్లాలో పేదల భూసమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపివ్యవసాయ కార్మిక సంఘం, నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పేదల భూములపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజరు చంద్ర దౌర్జన్యాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించడంతో జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి ప్రజలందరి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జెసి ఎస్.ఎస్.శోభిత మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, బంటువాని వలసలో జెసిబితో పడగొట్టిన కట్టడాలపై తహశీల్దార్, సంబంధిత అధికారులపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు వెంకటేశ్వర్లు మాట్లాడతూ పేదలకు న్యాయం చేస్తామని ఓట్లడిగి గెలిచి నేడు భూస్వాములకు, కార్పొరేట్లకు న్యాయం చేకూర్చడమే పనిగా పెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అక్రమ పనులకు అధికారులు తల్లొగ్గి పనిచేయడం దుర్మార్గమని, అటువంటి నీచపు పనులకు అధికారుల దూరంగా ఉండాలని సూచించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు మే 10వ తేదీ లోపు జిల్లాలో ఉన్న భూ భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని హెచ్చరించారు.