ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ బాట – యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

ప్రజాశక్తి – రాయచోటి సుదీర్ఘకాలం నుంచి అపరిష్కతంగా ఉన్న మున్సిపల్‌ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణలో భాగంగా శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డిని కలిసి ఉద్యమ కార్యచరణ నోటీసు ఇచ్చామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబీర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రాష్ట్ర విభజన జరిగి సుమారు పదేళ్లు కావస్తున్నప్పటికీ పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు, ఉత్తర్వులు ఇవే విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్న మున్సిపల్‌ టీచర్లకు మాత్రం వర్తించక పోవడం అన్యాయమన్నారు. మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ తగినంత మంది సబ్జెక్టు టీచర్లు లేరన్నారు. 3,4,5 తరగతులను విలీనం చేశారే తప్ప ఆ తరగతులు బోధించడానికి స్కూల్‌ అసిస్టెంట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రమోషన్లు, బదిలీలు కూడా రెగ్యులర్‌ చేయ లేదన్నారు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ టీచర్లకు ఇచ్చినట్లే మున్సిపల్‌ టీచర్లకు ఆర్బన్‌ ఎంఇఒల పోస్టులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ ఖాతాలు మున్సిపాలిటీలలో నిరుపయోగంగా వడి ఉన్నాయని, జీతాల నుంచి మిన హాయించే సొమ్ము వారి ఖాతాలకు జమ చేసేందుకు కానీ, ఖాతాలలో ఉన్న సొమ్ము అవసరాలకు వినియోగించు కునేందుకు కానీ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యలపై ఎన్నిమార్లు ప్రాతినిధ్యం చేసినా అవి పరిష్కారానికి నోచుకోక పోవడం వల్ల మున్సిపల్‌ టీచర్ల ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్యాచరణ చేపట్టాలని యుటిఎఫ్‌ నిర్ణయించిందన్నారు. మున్సిపల్‌ హైస్కూళ్ళలో తగినంత మంది సబ్జెక్టు టీచర్లను నియమించేందుకు వీలుగా ఎస్‌జిటి, పండిట్‌, పిఇటి పోస్టులను అప్‌ గ్రేడ్‌ చేయాలన్నారు. మున్సిపల్‌ టీచర్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. అక్టోబర్‌ 2న మున్సిపాలిటీలలో సత్యాగ్రహ దీక్ష, 17న డిఇఒ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్ష, 24న డైరెక్టరేట్‌ వద్ద 24 గంటల ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి పి వెంకటరమణ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్వ గౌరవ అధ్యక్షులు జి రాధాకష్ణ, ఏపీ ఎంఎస్‌టిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌, ఏపీ ఎంఎస్‌టిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సాధిక్‌ అలీ ఖాన్‌, మదనపల్లె అర్బన్‌ నాయకులు హరికష్ణ పాల్గొన్నారు.

➡️