ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్‌

ప్రజాశక్తి-కురిచేడు: నూతన ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం అన్యాయమని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఓవీ వీరారెడ్డి అన్నారు. యుటిఎఫ్‌ కురిచేడు మండల మహాసభ ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అన్నం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఓవీ వీరారెడ్డి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల పెన్షన్‌, కరువుభత్యం అరియర్స్‌ దాదాపు రూ.22 వేల కోట్లు రూపాయలు వెంటనే చెల్లించాలని, ఐఆర్‌ ప్రకటించి కమిటీని వెంటనే నియమించాలని, సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను ప్రకటించాలని, బదిలీలు ప్రమోషన్లపై నిర్దిష్ట చట్టం తెచ్చి వేసవి పూర్తయ్యేలోపు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకుడు మీగడ వెంకటేశ్వరరెడ్డి కూడా మాట్లాడారు. యుటీఎఫ్‌ నూతన కమిటీ ఎన్నిక అనంతరం యుటిఎఫ్‌ కురిచేడు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎస్కే ఖాదర్‌ వలి, అధ్యక్షులుగా అన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాసరావు, అసోసియేటెడ్‌ అధ్యక్షులుగా డి జాన్‌బాబు, మహిళా సహాధ్యక్షురాలుగా కేహిల్లా నైటింగేల్‌, కోశాధికారిగా కే పూర్ణచంద్రరావు, గౌరవ సలహాదారులుగా ఏ సింగరయ్య, డి లక్ష్మయ్య తదితరులు ఎన్నికయ్యారు.

➡️