ప్రజాశక్తి-బొబ్బిలి : ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టి విజయం సాధించిన భారత సైనిక దళాలకు సెల్యూట్ అంటూ కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జెసిరాజు ఆధ్వర్యంలో బుధవారం ఎన్టిఆర్ కూడలిలో నినాదాలు చేశారు. జెసి రాజు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి భారతీయ పౌరులను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయన్నారు. దేశ ప్రజలంతా ప్రభుత్వానికి, భద్రతా దళాలు అండగా ఉన్నారని అన్నారు. గెంబలి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, పుల్లెల శ్రీను, శివకాంత్, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య ‘ఆపరేషన్ సిందూర్’
విజయనగరం : ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే ‘ఆపరేషన్ సిందూర్’ అని రాష్ట సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారత సాయుధ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసి గట్టి సమాధానమిచ్చాయని, తీవ్రవాదంపై భారత ఉక్కు సంకల్పానికి ఇది ఒక నిదర్శనమని వెల్లడించారు.
పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపరేషన్ సింధూర్పై వైసిపి జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.