ప్రజాశక్తి-విజయనగరం : ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ప్రధానంగా ఆడిట్ టీం రిమార్కులలో సంతృప్తి చెందినట్లు రాయాలని తెలిపారు. సోమవారం పిజిఆర్ఎస్ కు 177 వినతులు అందాయి. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఒ శ్రీనివాస మూర్తి, ఆర్డిఒ కీర్తి డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవిన్యూ శాఖకు అత్యధికంగా 87 వినతులు అందాయి. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ వినతులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్షక, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు.రూ. 50 కోట్లు, ఆ పైబడిన ప్రాజెక్టుల వివరాలను అందజేయాలి అన్ని శాఖల అధికారులు 50 కోట్లు , ఆ పైబడి నిధులతో మంజూరైన ప్రోజెక్టుల వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మాలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వారికి వెంటనే అందజేయాలని ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. నగర పాలక సంస్థలో వినతులు స్వీకరణ విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి వినతులు వచ్చాయి. కమిషనర్ పల్లి నల్లనయ్య వినతులు స్వీకరించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. రెండు వినతులు రాగా, టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులకు అప్రమత్తం చేస్తూ నీటి పంపిణీ చేపడుతున్నామన్నారు. ఆండ్ర జలాశయం నుంచి ఇప్పటికే నెల్లిమర్ల వాటర్ వర్క్స్ వద్దకు నీరు చేరిందని కావున వేసవిలో నీటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఇఇ టి.రాయల్ బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, రమణమూర్తి, మేనేజర్ ప్రసాదరావు పాల్గొన్నారు.
