ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. 18 నెలలుగా సుమారుగా రూ.22కోట్లు పైన బిల్లులు పేరుకుపోయాయి. దీంతో బిల్లుల కోసం ఎక్కని మెట్లు లేవు. విన్నవించుకొనని ప్రజాప్రతినిధి లేరు. బిల్లుల కోసం నగర పాలక సంస్థ అధికారుల చుట్టూ తిరిగితే తప్ప బిల్లులు అవ్వని దుస్థితి నెలకొంది. గత ఏడాది కాలంగా కాళ్లు అరిగేలా తిరిగినా బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతునే ఉంది. దీంతో కనీసం సంక్రాంతి పండగకు అయినా బిల్లులు వస్తే తమను నమ్ముకున్న కార్మికులకు, కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్తితి ఉంటుందని, లేకుంటే తమతో ఉన్న కొన్ని వందల కుటుంబాలు సంక్రాంతి పండగ పస్తులతో గడపాల్సిన పరిస్తితి నెలకొందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు బిల్లులు అప్ లోడ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో కోట్లాది రూపాయిలు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో బిల్లులు పండగ ముందు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు.
మంత్రి కొండపల్లికి వినతి
తమకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కాంట్రాక్టర్లు వినతి అందజేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పండగ ముందే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు.