ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలోని కొవ్వాడ అగ్రహారం శ్మశానంలో ఉన్న స్వయంభు శివలింగాన్ని, దానికి సమీపంలో ఉన్న రాతి విగ్రహాలను మంగళవారం పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. పాల్గుణరావు పరిశీలించారు. ఆ శివలింగానికి ఉపయోగించిన రాయిని, దాని స్వభావాన్ని పరిశీలించారు. అనంతరం సర్పంచి కోట్ల రఘుతో మాట్లాడుతూ ఈ శివలింగం సుమారుగా 13వ శతాబ్ధానికి చెందినదన్నారు. ఈ ప్రాంతాన్ని 6వ శతాబ్ధం నుండి 13వ శతాబ్ధం వరకూ తూర్పు గాంగులు పాలించేవారన్నారు. వారి చివరి కాలంలో సుమారుగా 13వ శతాబ్ధంలో ముస్లీంల దండయాత్రలో ఈ విగ్రహాలు ధ్వంసం చేసి ఉంటారన్నారు. ఆ కాలంలో ఇక్కడ ఉన్న గుడిని, విగ్ర హాలను ధ్వంసం చేసి ఉండొచ్చన్నారు. శివలింగంతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వినాయకుడు, దేవాతా విగ్రహంతోపాటు పురాతన రాలు ఉన్నాయ న్నారు. ఈ విగ్రహాలకు సమీపంలోనే ఉన్న మైసాస రమర్ధిని విగ్రహం సుమారుగా వెయ్యి ఏళ్ల నాటిదిగా గుర్తించామన్నారు. సర్పంచి రఘు మాట్లాడుతూ త్వరలో ఈ పురాతన శివలింగానికి ఆలయం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామన్నారు. ఈ పురాతన విగ్రహాలకు మరమత్తులు చేయాలని పురావస్తు శాఖవారిని కోరారు. తమ గ్రామంలో ఉన్న పురాతన సంపదను కాపాడుకుంటామన్నారు. ఆయనతో పాటు ఆలయ కమిటీ మెంబర్లు కోట్ల సత్యం నాయుడు, లెంక రామకృష్ణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.
