అరాచక శక్తులను బిజెపి ప్రోత్సహిస్తోంది: టిడిపి

May 10,2025 20:47

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీలో అరాచక శక్తులను బిజెపి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్‌ వర్మ ప్రోత్సాహించడం దారుణమని టిడిపి నాయకులు సువ్వాడ రవి శేఖర్‌, గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు అన్నారు. శనివారం వారు స్థానిక టిడిపి కార్యాలయంలో ఇటీవల నగర పంచాయతీ బిజెపి నాయకులు అన్న క్యాంటీన్‌ పై చేసిన విమర్శలపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు పార్లమెంట్‌ కార్యదర్శి లెంక అప్పలనాయుడు మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌ పై నగర పంచాయతీ బిజెపి నాయకులు రాజకీయ లబ్ది కోసం అవాకులు చవాకులు పేలారాని అవన్నీ అవాస్థవాలని తెలిపారు. క్యాంటీన్‌లో అవకతవకలు జరుగుతున్నాయని వైసిపి నుంచి బిజెపిలో చేరిన నగర పంచాయతీ అరాచక నాయకుడుకి బిజెపి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్‌ వర్మ వత్తాసు పలికి ప్రోత్సహించడం పొత్తు ధర్మాన్ని విస్మరించడం కాదా అని ప్రశ్నించారు. దీనికి బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేష్‌ వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నగర పంచాయతీ బిజెపి నాయకుడు పబ్బం గడుపుకోవడానికి అన్న క్యాంటిన్‌పై లేనిపోని ఆరోపణలు చేశారని, బిజెపి నాయకుడిలా వ్యవహారించుకుండా వైసిపి నాయకుడిలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమిలో భాగస్వామ్యమైన బిజెపి ఇలాంటి నాయకులను ప్రోత్సాహించడం తగునా అని ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని పాటించని నగర పంచాయతీ బిజెపి నాయకున్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ప్రోత్సాహస్తున్న జిల్లా అధ్యక్షులు రాజేష్‌ వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే బిజెపి జాతీయ నాయకులు పురందేశ్వరికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు అవనాపు సత్యనారాయణ, కింతాడ కళావతి, బైరెడ్డి నాగేశ్వరరావు, రెడ్డి వేణు, కాళ్ల రాజశేఖర్‌, పంచాది కిరణ్‌, కలిశెట్టి కన్నంనాయుడు, ముడుమంచి లక్ష్మణరావు, మజ్జి ఆదినారాయణ, చందక శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️