విజయనగరం టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఒలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎపి సిఎంఎ ఆధ్వర్యాన నిరవధిక సమ్మెకు దిగారు. అందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాచేశారు. వైద్య ఆరోగ్యశాఖ లోని ఎంహెచ్ఎం కింద సిహెచ్ఒలుగా పని చేస్తున్న గత రెండేళ్లగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆరేళ్లు దాటిన సిహెచ్ఒలను క్రమంబద్దికరించాలని, ఎంహెచ్ ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతినెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని అసోసియేషన్ సబ్యులు పి.తెజేస్వని, కె.మౌనిక, పరిమళ, విజయలక్ష్మి, హరీష్, కనకదుర్గ తెలిపారు. ఉద్యోగుకు చేస్తున్న పోరాటానికి ఎపి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ బి.కాంతారావు మద్దతు తెలిపారు. న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామన్నారు. సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
