ప్రజాశక్తి-బాడంగి : విద్యుదాఘాతంతో మరణించిన రైతుల కుటుంబాలకు విద్యుత్తు సంస్థ ద్వారా వచ్చిన పరిహారాన్ని ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు అందజేశారు. గతేడాది తెర్లాం మండలం అంట్లవారకు చెందిన రైతు కోట రామారావు తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టే క్రమంలో మోటార్ వైర్లను సరిచేస్తుండగా విద్యుత్తు షాక్తో మృతి చెందారు. బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన నల్ల అప్పలనాయుడు కూడా పొలంలో విద్యుదాఘాతంతో మరణించారు. దీంతో ఎమ్మెల్యే బేబినాయన సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విద్యుత్తు సంస్థ తరపున పరిహారం అందేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎమ్మెల్యే, బుడా చైర్మన్ అందజేశారు. గతంలో ఇటువంటి మరణాలకు సంబంధించిన పరిహారం రావడానికి కొన్నేళ్లు పట్టేదని, ఇప్పుడు ఎమ్మెల్యే చొరవతో అతి తక్కువ కాలంలో ఈ ఆర్థిక సహాయం మంజూరైందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవి, ఎఎంసి చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, ఎంపిటిసి పాలవలస గౌరు, సర్పంచ్ మూడడ్ల సత్యం, డిప్యూటీ డిఇ భానునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
