సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
ముస్లిము సంఘాల డిమాండ్
మద్దతు తెలిపిన సిపిఎం,సిపిఐ,కాంగ్రెస్,పలు ప్రజా సంఘాలు
నగరంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో
కలెక్టర్ కి.వినతి
ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : వక్స్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో ముస్లిములు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఉర్దూ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ మూడు లాంతర్లు మీదుగా ఎంజీరోడ్డు, గంటస్తంభం, కన్యాక పరమేశ్వరి జంక్షన్, ఎం ఎన్ సి ఎస్,.గుడ్షెడ్,బాలాజీ మార్కెట్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు.అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి,రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిము మైనారిటీ నాయకులు మహమ్మద్ నిజాం, షకీర్ షేక్, అక్బర్ షరీఫ్, ఎం.డి ఇక్బాల్, షేక్ ముస్తాధీన్ , మున్వర్ బాయ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, సి.పి ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, డి.బి.ఎస్.యు నాయకులు పి.చిట్టిబాబు, బీఎస్పీ నాయకులు పి.వెంకటరమణలు మాట్లాడుతూ ఎన్నికల ముందు సబ్కా వికాస్ సబ్కా సాత్’ అని చెప్పిన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిము మైనారిటీలపై దాడులు చేస్తోందన్నారు. ఇందుకు ఎన్ఆర్పి, యుసిసి, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వంటివి ఉదాహరణ అని చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వక్స్ బోర్డును రద్దు చేసి ముస్లిముల మనోభావాలను దెబ్బతీసిందని, వక్స్ ఆస్తులు ప్రభుత్వానికో లేదా ఏ సంస్థకో చెందినవి కావని, ముస్లిముల అభివృద్ధి కోసం పూర్వీకులు దానధర్మాలు చేసి ఇచ్చిన ఆస్తులని స్పష్టం చేశారు. ఈ ఆస్తులపై బిజెపి ప్రభుత్వం కన్నేసిందని, సవరణ పేరుతో వాటిని దోచుకోవాలని కుట్ర పన్నుతోందని తెలిపారు. ఈ చట్టానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముస్లిములకు రక్షణగా ఉంటామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు వెన్నుపోటు పొడవడం బాధాకరమని అన్నారు. స్వాతంత్య్ర్యం కోసం ఎంతోమంది ముస్లిము పండితులు, ఉలమాలు, మేధావులు ప్రాణాలర్పించారని, ఆ చరిత్రను బిజెపి ఒకసారి చదువుకోవాలని సూచించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వక్స్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం ను జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కి అందజేశారు. నగరంలో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిము సోదరులు పాల్గొన్నారు.
