ప్రజాశకి-విజయనగరం టౌన్ : కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఎ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ డిమాండ్ చేశారు. గురువారం పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి కోట జంక్షన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో 6100 పోస్టుల భర్తీకి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేశారని, 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్షకు 4, 59,182 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో అర్హత సాధించిన 95 208 మందికి గత ఏడాది డిసెంబర్లో ఈవెంట్స్ నిర్వహించారని తెలిపారు. మెయిన్ ఎగ్జామ్ గురించి ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదన్నారు. సుమారు ఆరేళ్లగా అభ్యర్థులు రీడింగ్ రూముల్లోనూ, కోచింగ్ సెంటర్లలోనూ చదువుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వెంటనే మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో నాగరాజు, శివ, లక్ష్మణ, కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు.
