ప్రజాశక్తి – చీపురుపల్లి : మత్తు పానీయాలకు అలవాటు పడి ఏ ఒక్కరూ తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని చీపురుపల్లి ఎక్సైజ్ సిఐ సిహెచ్ చక్రవర్తి అన్నారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గల ఆటో స్టాండ్ వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, స్థానికులకు మత్తు పానీయాల అలవాటు వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు నడుపుతున్న డ్రైవర్లు ప్రత్యేకించి మద్యం సేవించడం వల్ల వారి ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సైతం ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మద్యం సేవించడం వల్ల వారి జీవితాలతో పాటు వారిపై ఆధారపడ్డ వారి జీవితాలు కూడా రోడ్డును పడే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ చక్రవర్తితో పాటు ఎస్ఐ గిరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
