ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని మొయిదకు చెందిన వారి 2 మోటార్ సైకిళ్ళుని దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులని అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 మోటార్ సైకిళ్ళును రికవరీ చేసి, వారిని రిమాండ్కు తరలించామని విజయనగరం డిఎస్పి ఎం.శ్రీనివాస రావు వెల్లడించారు. శనివారం ఆయన దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొయిద గ్రామానికి చెందిన తాళ్ళపూడి తాతారావు ఈ నెల 2న తన స్ల్పెండర్ ప్లస్ ప్లస్ మోటార్ సైకల్ని తన ఇంటి ముందు పార్క్ చేశారు. దీన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అదే గ్రామానికి చెందిన పొట్టుపోగుల సంతోష్ ఈ నెల 3న తన టివిఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకల్ని జ్యూట్ మిల్ సమీపంలో పార్క్ చేయగా, దొంగిలించారు. దీంతో బాధితులు నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం ఎన్ఐ బి.గణేశ్, వారి సిబ్బంది కలిసి చిన బూరాడపేట గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వస్తూ, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంపై వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారి పేర్లు బెల్లాన చంద్రశేఖర్, దన్నాన సూరిబాబు అని చెప్పారు. వారిపై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు అంగీకరించారు. వాళ్ళు ఇద్దరూ కలిసి, నెల్లిమర్ల మండల పరిధిలో 2 బైక్లు, గజపతినగరం మండల పరిధిలో 1 బైక్, విజయవాడ సిటి పరిధిలో 4 బైక్లు, గుర్ల మండల పరిధిలో 1 బైక్, కశింకోట మండల పరిధిలో 1 బైక్, మొత్తం 9 బైక్లు దొంగిలించినట్లు అంగీకరించారు. వారి నుండి మొత్తం 9 బైక్లు రికవరీ చేసి, నిందితులను రిమాండుకు తరలించామని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో భోగాపురం సిఐ జి.రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
