ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపల్ చైర్మన్ పదవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణపై టిడిపి కౌన్సిలర్లు, వైసిపి అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని టిడిపి, తీర్మానం వీగుతుందని వైసిపి నేతలు.. ఇలా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తుకు పై ఎత్తులు
మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానంలో నెగ్గేందుకు టిడిపి, ఓడించేందుకే వైసిపి నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా 20 వార్డులలో వైసిపి, 10 వార్డులలో టిడిపి, ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ వి.వనజకుమారి వైసిపిలో చేరడంతో ఆ సంఖ్య 21కు చేరింది. వైసిపి కౌన్సిలర్ ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 20 మంది వైసిపి కౌన్సిలర్లలో 10 మంది కౌన్సిలర్లు టిడిపికి మద్దతు ప్రకటించారు. దీంతో వైసిపి బలం 10కి తగ్గింది. అవిశ్వాస తీర్మాన సమావేశం జరగాలంటే 20 మంది కౌన్సిలర్లు హాజరు కావాలి. ఒకరు తగ్గినా కోరం లేక సమావేశం వాయిదా పడనుంది. ఒక్కసారి సమావేశం వాయిదా పడితే ఏడాది వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. దీంతో సమావేశానికి కోరం సభ్యులు హాజరు కాకుండా చూసేందుకు వైసిపి చూస్తోంది. పూర్తి స్థాయి సభ్యులతో సమావేశానికి వెళ్లి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గేందుకు టిడిపి నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగే అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ ఏర్పాట్లను ఎన్నికల అధికారి రామ్మోహనరావు సోమవారం పరిశీలించారు. సమావేశం సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయనతో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
వైసిపి కౌన్సిలర్లకు విప్ జారీ
వైసిపి కౌన్సిలర్లకు జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు విప్ జారీ చేశారు. మంగళవారం అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ ప్రత్యేక సమావేశం జరగనుండడంతో వైసిపికి అనుకూలంగా ఓటు వేయాలని ఆ పార్టీ కౌన్సిలర్లకు సోమవారం విప్ జారీ చేశారు. విప్ ప్రతులను ఎన్నికల అధికారి రామ్మోహనరావుకు వైసిపి పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేశ్ నాయుడు, నాయకులు అందించారు.
శిబిరంలోకి టిడిపి కౌన్సిలర్లు
అవిశ్వాస తీర్మానాన్ని ఎలాగైనా ఓడించాలని లక్ష్యంతో వైసిపి నాయకులు ప్లాన్ వేసి, టిడిపి కౌన్సిలర్లకు గాలం వేసేందుకు సిద్ధమయ్యారు. టిడిపికి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లను బయటకు తెచ్చి తమ వైపు తిప్పుకొనేందుకు వైసిపి నాయకులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో టిడిపి కౌన్సిలర్లతో మంతనాలు సాగించి, ఒకరినైనా తమవైవు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు టిడిపి నాయకులకు తెలియడంతో 10 మంది పార్టీ కౌన్సిలర్లను ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక శిబిరానికి తరలించారు. దీంతో నేడు అవిశ్వాస తీర్మానం సమావేశంలో ఏమి జరుగుతుందోనని ప్రజలు, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కూటమి వచ్చాక రాజకీయ వ్యభిచారం
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వ్యభిచారం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు వ్యాఖ్యానించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు దిగజారి పోయాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి 95 శాతం విజయం సాధిస్తే, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి చైర్మన్ సీట్లను లాక్కునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం సరికాదన్నారు. వైసిపి కౌన్సిలర్లకు విప్ జారీ చేశామని, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే కౌన్సిలర్ పదవి పోవడం ఖాయమని హెచ్చరించారు.
