అపరాలు కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం

May 5,2025 21:29

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో అపరాల (మినుములు) పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. మినుములను కలెక్టరేట్‌ ఎదుట పోసి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అపరాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు, నాయకులు చెబుతున్నారని, కానీ గ్రామాల్లో మినప పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. గిట్టుబాటు ధర లేక చిన్న కారు సన్న కారు రైతులు కుదైలై పోతున్నారన్నారు. వ్యాపారులు మధ్యవర్తులు గ్రామాల్లో దోచుకుంటున్నారని, వారికి అధికారులు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.7400 మద్దతు ధర పెట్టినప్పటికీ బయట దళారులు రూ.5వేలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి న్యాయం చేఆయలని కోరారు. వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌ శాఖ అధికారి వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పడంతో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, మార్క్‌ఫెడ్‌ డిఎం వచ్చి రేపటి నుంచి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షులు లోకావరపు ఆదినారాయణ మూర్తి, కౌలు రైతు సంఘం నాయకులు కసిరెడ్డి నారాయణరావు, విసినిగిరి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీరామ్మూర్తి, సిరికి వెంకట సత్య నారాయణ, సీర కృష్ణ, పాల రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొంప కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మికులు సంఘం జిల్లా కార్యదర్శి గాడు అప్పారావు, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️