ఘనంగా ఉయ్యాల కంబాల

May 5,2025 21:32

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి దాడితల్లి పండగ సందర్భంగా సోమవారం ఉయ్యాల కంబాల ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాలు, పూజారిని గ్రామంలో ఊరేగించారు. పూజారిని ఉయ్యాలలో ఊపి ఉయ్యాల కంబాల నిర్వహించారు. దాడితల్లి ఆలయం వద్ద రెండో రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి యాత్రికులు క్యూ కట్టారు. బొబ్బిలి చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈ పండగను వైభవంగా నిర్వహిస్తున్నారు. దాడితల్లి పండగలో భాగంగా సిరిమానోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. గొల్లపల్లిలో సిరిమానోత్సవాన్ని మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభిస్తారు. గొల్లపల్లి, బొబ్బిలిలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.
300 మందితో బందోబస్తు
గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గొల్లపల్లి, బొబ్బిలిలో సోమవారం ఎస్‌పి పర్యటించారు. సిరిమానోత్సవ రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. గొల్లపల్లి వనంగుడి, దాడితల్లి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండగ నిర్వహించాలని గ్రామపెద్దలను ఆదేశించారు. అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో గొల్లవీధి – రావువారివీధి మధ్య జరిగిన గొడవపై ఆరా తీశారు. గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిఎస్‌ఫి భవ్యరెడ్డి, పట్టణ సిఐ కె.సతీష్‌ కుమార్‌ను ఆదేశించారు.
యాత్రికులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగకు వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి చెప్పారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ పండగకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. పైపులైన్‌ సమస్య ఉన్న ప్రాంతాలకు ఒక మున్సిపల్‌, రెండు అద్దె ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయాల వద్ద ప్రత్యేక కార్మికులను నియమించి పారిశుధ్య పనులు చేస్తున్నామన్నారు. సిరిమానోత్సవం జరిగే రహదారులపై గోతులను పూడ్చినట్లు వివరించారు. సిరిమాను వెనుక పారిశుధ్య కార్మికులను ప్రత్యేక బృందంగా నియమించి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

➡️