ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఐసిడిఎస్ను క్రమబద్దీకరించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన రాష్ట్రపతికి అంగన్వాడీ కార్యకర్తలు వ్యక్తిగత దరఖాస్తులు పంపించారు. శనివారం కెఎల్పురంలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ ఆ దరఖాస్తులను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఐసిడిఎస్ ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తయిందని, ఈ నేపథ్యంలో ఐసిడిఎస్ను క్రమబద్ధీ కరించాలని, దశాబ్దాలుగా సర్వీస్ అందిస్తున్న వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26వేలు అమలుతో పాటు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ వ్యక్తిగతదరఖాస్తులను పంపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి, నాయకులు ఎం.కృష్ణమ్మ, పి.ప్రభ, వరలక్ష్మి, పి.జ్యోతి, సిహెచ్ రూప, ఎం. రమణమ్మ, శ్యామల, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
